విశాఖపట్నంలోని ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామ సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘటన భయానక పరిస్థితులను సృష్టించింది. దాదాపుగా ఐదారు గ్రామాల ప్రజలపై ఈ గ్యాస్ తీవ్ర ప్రభావం చూపింది. వందలసంఖ్యలో బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు. ఇప్పటికే సుమారు పదిమంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దేశ ప్రధాని నరేంద్రమోడీ తదితర ప్రముఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అంతేగాకుండా.. బాధిత కుటుంబాలకు భారీగా ఆర్థిక సాయం అందించారు. తాజాగా.. ఈఘటనపై విజయశాంతి స్పందించారు.
*కరోనా వైరస్ ఒకవైపు యావత్ ప్రపంచాన్నీ వణికిస్తున్న సమయంలో విశాఖపట్టణం, పరిసర గ్రామాల ప్రజలు విషవాయువు బారిన పడటం ఎంతో బాధ కలిగిస్తోంది. వృద్ధులు, మహిళలు, బాలలు, మూగజీవాలు ఈ విషవాయువు ప్రభావానికి లోనై తీవ్ర అనారోగ్యం పాలవడం, మరణాలు సంభవించడం వంటి పరిణామాలు తీరని వేదనను మిగిల్చాయి. బాధిత కుటుంబాలవారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గుండె ధైర్యంతో కరోనాపై పోరాడుతున్న విశాఖ పౌరులు, పరిసర గ్రామాలవారు ఈ విషవాయువు ప్రభావం నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను* అంటూ ఆమె ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ ఒకవైపు యావత్ ప్రపంచాన్నీ వణికిస్తున్న సమయంలో విశాఖపట్టణం, పరిసర గ్రామాల ప్రజలు విషవాయువు బారిన పడటం ఎంతో బాధ కలిగిస్తోంది. వృద్ధులు, మహిళలు, బాలలు, మూగజీవాలు ఈ విషవాయువు ప్రభావానికి లోనై తీవ్ర అనారోగ్యం పాలవడం, మరణాలు సంభవించడం వంటి పరిణామాలు తీరని వేదనను మిగిల్చాయి.
— VijayashanthiOfficial (@vijayashanthi_m) May 7, 2020