విశాఖపట్నంలోని ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ప్రత్యేక బస్సుల్లో వీరిని సింహాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. సింహాచలం కొండ దిగువ పాత గోశాల దగ్గర నుంచి మార్కెట్ కూడలి వరకు ఉన్న పలు ప్రైవేట్ కల్యాణ మండపాల్లో పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వెంకటాపురంలో ఉన్న 1250 ఇళ్ల నుంచి సుమారు 8 వేల మందిని, నందమూరినగర్లోని 600 కుటుంబాలకు చెందిన 2,250 మందిని, కంపరపాలెంలోని 250 ఇళ్ల నుంచి 1200 మందిని, పద్మనాభనగర్లో 500 కుటుంబాల నుంచి 2,500 మందిని, ఎస్సీ, బీసీ కాలనీలో 480 ఇళ్ల నుంచి 2 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.
వారందరికీ అక్కడే భోజన ఏర్పాట్లు చేసి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా ప్రమాదం లేదని నిర్ధారించిన తరువాతే ప్రజలను గ్రామాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని అధికారులు అంటున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, చినగదిలి తహసీల్దార్ పునరావాస కేంద్రాల వద్దకు వెళ్లి బాధితులను పరామర్శించారు. కాగా, గురువారం అర్ధరాత్రి దాకా అధికారులు వెంకటాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.