దేశంలో కరోనా మహమ్మారి ఎప్పుడైతే మొదలైందో ఆనాటి నుంచి సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ సమయంలో ఎక్కువగా బ్యాంకులకు వెళ్లకుండా దగ్గరలోని ఏటీఎం లు ఎక్కడైనా ఉంటే అందులోనుంచి డబ్బు డ్రా చేసుకుంటూ తమ పనులు కానిచ్చేస్తున్నారు ప్రజలు. ఏటీఎం కు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అపరిచితులు ఎవరైనా ఉన్నారా అని చూసుకోవాలి. అలా ఒకటికి పదిసార్లు చూసుకున్నాక డబ్బులు తీసుకొని వస్తుంటారు. అయితే, లాక్ డౌన్ కారణంగా ఏటీఎం వద్ద పెద్దగా మనుషులు కనిపించడం లేదు. ప్రస్తుతం జనసంచారం లేకపోవడంతో ఏటిఎం లు మనుషుల కన్నా పశు పక్షాదులు ఎక్కువగా వాడుతున్నాయి.
ఇటీవలే ఓ కోతి ఏటీఎంలోకి దూరి నానా యాగీ చేసింది. ఏటీఎం మెషిన్ ను పగలగొట్టే ప్రయత్నం చేసింది. తాజాగా ఇప్పుడు ఓ పాము ఏటీఎం లోకి దూరింది. ఎలా దూరిందో తెలియదు. అలా లోపలికి వెళ్లిన ఆ పాము బయిటకు వచ్చేందుకు ప్రయత్నం చేసింది. కానీ, దాని వల్లకాకపోవంతో అక్కడి నుంచి మిషన్ లోకి దూరింది. ఏటీఎంలోకి పాము దూరడం కొంతమంది ప్రజలు గమనించి వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన ఘజియాబాద్ లోని డెహ్రాడూన్ స్కూల్ వద్ద ఉన్న ఓ బ్యాంక్ ఏటీఎంలో జరిగింది. ఇప్పుడు ఆ ఏటిఎం వద్దకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు.