ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన ఎంఐజీ–29 యుద్ధ విమానం శుక్రవారం ఉదయం పంజాబ్లో కూలిపోయింది. షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలోని చువార్పూర్ గ్రామ పొలాల్లో ఈ విమానం కూలిపోయిందని ఎస్బీఎస్ నగర్ ఎస్పీ వజీర్ సింగ్ ఖైరా తెలిపారు.
విమానం కూలిపోయినట్టు శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో తమకు సమాచారం అందిందని షహీద్ భగత్ సింగ్ నగర్ సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అల్కా మీనా చెప్పారు. విమానం కూలిపోతున్న సమయంలో పైలట్ అప్రమత్తమై పారాచూట్ ద్వారా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. పోలీసులు అతడిని గుర్తించి హెలీకాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. సాంకేతిక సమస్యతోనే విమానం కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి.