ఆఫ్ఘనిస్తాన్లో కరోనా వైరస్ క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా.. ఆదేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫిరోజుద్దీన్ ఫిరోజ్ కూడా కరోనా వైరస్ బారినపడినట్లు అధికారులు వెల్లడించారు. ఇక గత 24 గంటల్లో 215 కొత్త కరోనా కేసులు నమోదుకాగా.. అందులో ఆరోగ్యశాఖ మంత్రి కూడా ఉన్నట్లు అధికావర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్నిమంత్రిత్వ శాఖ కూడా ధృవీకరించింది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,700 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు సుమారు 100 కంటే ఎక్కువగానే మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఏకంగా ఆరోగ్యశాఖ మంత్రికే కరోనా వైరస్ సోకడంతో ప్రభుత్వ, అధికార వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎవరెవరిని కలిశారు..? ఎంతమందిని కలిశారు..? తదితర అంశాలపై అధికారులు వివరాలు సేకరించి, క్వారంటైన్కు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా.. ఆప్ఘనిస్తాన్కు భారత్ సాయం అందించిన విషయం తెలిసిందే. పారాసెటమాల్ మాత్రలు, హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను అందించింది.