దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు మొత్తం 5980 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే కొత్తగా 448 కరోనా కేసులు నమోదు అయ్యాయని, 398 మంది బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేద్రజైన్ శుక్రవారం వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తంగా 1931 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, చికిత్స పొందుతున్నవారిలో 87 మంది ఐసీయూలో ఉన్నారని, మరో 13 మంది వెంటీలేటర్పై ఉన్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్-19 కేర్ సెంటర్ రెండు మూడు రోజుల్లో ప్రారంభమవుతుందని తెలిపారు.
అలాగే.. ఇప్పటివరకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు చెందిన 35 మంది జవాన్లు కరోనా బారిన పడ్డారు. వీరిలో 11 మంది ముంబై ఎయిర్ పోర్టులో విధులు నిర్వర్తిస్తుండగా..11 మంది ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ముగ్గురు, ముంబై పోర్టులో డ్యూటీ చేస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, కోల్ కతాలో సీఐఎస్ఎఫ్ కు చెందిన అసిత్ కుమార్ షా కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.