తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొత్తగా మరో 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ రోజు 34 మంది కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1132కు చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 727మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో 376మంది బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఇక తెలంగాణలో ప్రస్తుతం 9 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. అలాగే.. మరో 14 జిల్లాలను గ్రీన్ జోన్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన పేర్కొన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 16 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని, ఇక్కడ మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నామని, వైరస్ వ్యాప్తి నిరోధానికి అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కాగా, ఇప్పటివరకు 29మంది కరోనాతో మరణించారు.