మద్యం అమ్మకాలపై తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తమిళనాడులోని అన్ని ప్రభుత్వ టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అయితే.. కేవలం ఆన్లైన్లో మాత్రమే మద్యం అమ్మకాన్ని అనుమతించింది. లాక్డౌన్ ముగిసేవరకు మద్యం అమ్మకాలను చేపట్టవద్దని ఆదేశించింది. అయితే.. ఒక్క చెన్నై నగరంలో తప్ప మిగతా రాష్ట్రమంతటా మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తోంది. దీనిపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ రోజు ఏకంగా కొత్తగా 600 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో చెన్నై నగరంలోనే 399 కేసులు నమోదు అయ్యాయని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్ వెల్లడించారు. దీంతో మొత్తంగా రాష్ట్రంలో 5409 కరోనా కేసులు నమోదవగా, 37 మంది మరణించారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం 3825 కేసులు యాక్టివ్గా ఉన్నాయని, మరో 1547 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు.