విశాఖపట్నం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటన భయాలు శుక్రవారంతో పాటు శనివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి. గ్యాస్ లీకేజ్ను కట్టడి చేసినా బయట వాతావరణం వేడిగా ఉండడంతో పాటు అక్కడక్కడ గ్యాస్ వాసనలు కూడా వస్తుండడంతో ఎవరికి వారు ఇంకా గ్యాస్ లీకేజ్ ఆగలేదన్న ఆందోళనలతోనే ఉన్నారు. ఇక ఇప్పటికే చుట్టు పక్కల గ్రామాల వారీని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రచారం ఇలా ఉంటే గ్యాస్ లీకేజ్ ఆగలేదన్న ప్రచారాన్ని ఎన్డీఆర్ఎఫ్ కొట్టిపారేసింది. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని సూచించింది.
అయితే నగరం అంతా అతలా కుతలం కావడంతో విశాఖ జనాలు ఇంకా ఆందోళనల్లోనే ఉన్నారు. మరో నాలుగైదు రోజులకు కాని చాలా మంది ప్రశాంత పరిస్థితుల్లోకి వచ్చేలా లేరు. ఈ ప్రమాదంలో మృతులసంఖ్య శుక్రవారానికి 12కు చేరినట్టు అధికారులు తెలిపారు. మరో 193 మంది బాధితులు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే గ్యాస్ లీకేజీ ఘటనను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్రంగా పరిగణించింది. ఆ కంపెనీపై తాత్కాలికంగా రూ.50 కోట్ల జరిమానా విధించింది. ప్రమాదంపై విచారణ జరుపడానికి ఐదుగురుసభ్యులతో కమిటీని నియమించింది. ఈ నెల 18లోపు నివేదికను అందజేయాలని కమిటీకి సూచించింది.