ఇంట్లో తల్లిదండ్రుల‌ పక్కన హాయిగా నిద్రిస్తున్న‌ మూడేళ్ల‌ చిన్నారిని చిరుతపులి ఎత్తుకెళ్లింది. ఈ ఘటన క‌ర్నాట‌క రాష్ట్రం బెంగళూరులోని మగది తాలూకా రామనగరలో శుక్రవారం రాత్రి జరిగింది. వేసవి కాలం కావడంతో చల్లటి గాలి కోసం మూడేళ్ల‌ చిన్నారి హేమంత్‌ తల్లిదండ్రులు తలుపులు తెరిచి పడుకొన్నారు. అయితే.. అంద‌రూ గాఢ‌నిద్ర‌లోకి జారుకున్నారు. ఇంత‌లోనే మెల్ల‌గా ఇంట్లోకి ప్రవేశించించింది ఓ చిరుత. తల్లి పక్కన పడుకొన్న చిన్నారిని నోట కరుచుకొని అక్క‌డి నుంచి పరుగు తీసింది. ఉదయం లేచి చూసే సరికి పిల్లాడు కనిపించకపోవడంతో త‌ల్లిదండ్రులు, చుట్టుప‌క్క‌ల‌వాళ్లు బోరున‌విల‌పిస్తూ పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు.

 

వారు నిద్రించిన‌ ఇంటికి సుమారు 60 మీటర్ల దూరంలోని చెట్ల పొదల్లో సగం తిని పడేసిన బాలుడి మృతదేహం వారికి కనిపించడంతో త‌ల్లిదండ్రులు గుండెల‌విసేలా రోదించారు. ఇటీవలనే పిల్లాడితో కలిసి తల్లిగారింటికి వ‌చ్చారు. ఈ ఘ‌ట‌న గ్రామస్థులను తీవ్రంగా  కలిచివేసింది. గ్రామస్తుల‌ ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘ‌ట‌న‌తో ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: