కరోనా వైరస్ భారత్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. రోజువారీగా నాలుగువేలకు అటుఇటుగా కేసులు నమోదు అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో పలువురు విశ్లేషకులు చెబుతున్న అంచనాలు కూడా కరోనా ఉగ్రరూపం దాల్చుతుందని హెచ్చరిస్తున్నాయి. ఈ సందర్భంగా వారు దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరిగిన విధానాన్ని విశ్లేషిస్తున్నారు. దేశంలో మార్చి 5 నాటికి 30 కేసులు, మార్చి 15 నాటికి 114, మార్చి 25వ తేదీకి 657 కేసులు, మార్చి 31 నాటికి 1397 కేసులు, ఏప్రిల్ 5 నాటికి 4289 కేసులు, ఏప్రిల్ 10వ తేదీ నాటికి 7600 కేసులు, ఏప్రిల్ 20 నాటికి 18539 కేసులు, ఏప్రిల్ 30వ తేదీ నాటికి 34863 కేసులు, మే 5వ తేదీ నాటికి 49400 నమోదు అయ్యాయని చెబుతున్నారు.
అయితే.. మే 10వ తేదీ నాటికి 70 వేలు, మే 20వ తేదీ నాటికి 140వేలు, మే నెలాఖరుకు 3లక్షల కేసులు నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ కేసులన్నీ కూడా దేశవ్యాప్తంగా కాకుండా.. కేవలం రెడ్ జోన్ ప్రాంతాల్లోనే నమోదు అవతుండడం గమనార్హం. అంతేగాకుండా.. కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో ఒకరి నుంచి మరొకరికి తెలియకుండా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆందోళన చెందుతున్నారు. నిజానికి.. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల్లో దాదాపుగా 80శాతం బాధితుల్లో లక్షణాలే కనిపించడం లేదని అధికావర్గాలే చెబుతున్నాయి. తాజాగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారత్ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముందుముందు కరోనా బీభత్సం సృష్టించడం ఖాయంగానే కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.