తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అదికూడా హైదరాబాద్ కేంద్రంగానే కరోనా వైరస్ ప్రభావం తీవ్రరూపం దాల్చుతోంది. మొన్నటి వరకు పదికి అటు ఇటుగా నమోదు అయిన కేసులు శనివారం మాత్రం కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్ పరిధిలోనే 30 ఉండగా, రాష్ర్టానికి వలస వచ్చినవారిలో ఓ వ్యక్తికి వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,163కు చేరింది. శనివారం ఒకరు ప్రాణాలు కోల్పోగా, 24 మంది డిశ్చార్జి అయ్యారు.
ప్రస్తుతం 382 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదలచేసింది. అయితే.. హైదరాబాద్లోనే ఊహించని విధంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో జీహెచ్ఎంసీపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి, లాక్డౌన్ నిబంధనలను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అధికారులు కంటైన్మెంట్ జోన్లపై అప్రమత్తంగా ఉంటున్నారు.