కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో విలవిలాడుతున్న కార్మికులపై మరో పిడుగుపడింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో కార్మిక చట్టాల్లో పలు కీలక సంస్కరణలు తేవడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం చట్టాలకు తూట్లు పొడుస్తున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. ఏకంగా కార్మికచట్టాలను ఇష్టారీతిన మార్చివేస్తున్నాయి. కార్మికుల హక్కులు, రక్షణ చర్యలను గాలికివదిలివేస్తున్నాయి. కార్మిక చట్టాల నుంచి పరిశ్రమలకు తాత్కాలిక మినహాయింపులు కల్పించాయి.
అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్నహక్కులను కాలరేసే విధంగా ఉద్యోగులను నియమించుకోవడం, తొలిగించడంలో యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాయి. అలాగే పనివేళలను సైతం 8 నుంచి 12 గంటలకు పెంచాయి. తనిఖీల నుంచి కూడా మినహాయింపునిచ్చాయి. అయితే.. దీనిపై పరిశ్రమల వర్గాల నుంచి సానుకూలత వ్యక్తం కాగా, కార్మిక సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు గుజరాత్లోని బీజేపీ సర్కార్ కూడా యూపీ, మధ్యప్రదేశ్ బాటలోనే నడిచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ రాష్ట్రాల నిర్ణయాలు పెద్దదుమారాన్ని రేపుతాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.