ఇటీవల విశాఖలో గ్యాస్ లీకేజ్ ఎంత విషాదం జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ విషాద ఘటనలో 12మంది మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఇంకా ఆ విషయవాయు ప్రభావం ఉందని అంటున్నారు. ప్రజలు భయపడుతూనే ఉన్నారు. విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన కారణంగా సమీప గ్రామాల్లో ఉండటానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేవా? అనే దానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలోని స్టైరిన్ గ్యాస్ ట్యాంక్ ఉష్ణోగ్రత 80 డిగ్రీలకు తగ్గిందని, అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అన్నారు.
అయితే ఈ ప్రమాదానికి కారణమైన స్టైరిన్ లిక్విడ్ గడ్డకట్టి పాలిమర్ అయిందని, దీని నుంచి ఎలాంటి వాయువు బయటకు రావడం లేదని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ జీఎం మోహన్ రావు స్పష్టం చేశారు. ఈ ట్యాంకుల్లో ఉన్న స్టైరిన్ లిక్విడ్ ను వెనక్కి పంపే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు . ప్రమాదం సంభవించిన ట్యాంకు కాకుండా కంపెనీలో 2, విశాఖపోర్టులో 2 స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయని, ఈ ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.