కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఊహించని షాక్లు తగులుతున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని, కేవలం హదరాబాద్కు మాత్రమే పరిమితం అయిందని, జిల్లాలు అన్నీ కోలుకున్నట్టేనని అనుకుంటున్న తరుణంలోనే కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. వలస కూలీలకు కరోనా వైరస్ సోకడంతో మళ్లీ రూరల్ ఏరియాలో కలకలం రేగుతోంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లికి చెందిన ముగ్గురు వలస కూలీలకు కరోనా పాజిటివ్ అని తేలింది. బెల్లంపల్లి ఐసోలేషన్ వార్డులో ఉన్న వీరిని హుటాహుటిన హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. ముగ్గురు కూలీలు పనుల కోసం ముంబైకి వలస వెళ్లారు.
లాక్డౌన్ నేపథ్యంలో అక్కడ పనులు లేకపోవడంతో కాలినడకన మంచిర్యాల జిల్లా రాపల్లికి వచ్చారు. పోలీసులు వారిని బెల్లంపల్లి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. రక్త నమూనాలు హైదరాబాద్కు పంపించారు. రిపోర్టులో కరోనా పాజిటివ్ రావడంతో వారిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. కూలీలు ముందు జాగ్రత్తగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అధికారులు అంటున్నారు. ఇలా అనేక జిల్లాలకు వలస కూలీలు కాలినడకన గ్రామాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముందుముందు ఏం జరుగుతుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు.