తెలంగాణలో కరోనా వైరస్ బాధితులకు సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ చికిత్స అందించేందుకు గాంధీ దవాఖానలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గాంధీ, ఈఎస్ఐసీ దవాఖానల్లో ప్లాస్మా థెరపీ చికిత్సకు ఐసీఎంఆర్ ఇటీవల అనుమతి ఇవ్వడంతో చకచకా ఏర్పాట్లు చేపట్టింది. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినవారిలో కరోనా పాజిటివ్తో కోలుకొన్న 15 మంది చికిత్సకు అవసరమైన ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అలాగే.. గాంధీ దవాఖానలో కరోనా నుంచి కోలుకొన్నవారిలో 200 మంది కూడా ప్లాస్మా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు.
సోమవారం విదేశాల నుంచి వచ్చిన 15 మంది ప్లాస్మాను సేకరించనున్నారు. ఐసీఎమ్మార్ మార్గదర్శకాల ప్రకారం ప్లాస్మా థెరపీకి అర్హులైన కరోనా బాధితులు గాంధీలో ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. అయితే.. ఈ చికిత్సపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఏ మేరకు ప్లాస్మా థెరపీ ట్రయల్స్ ఫలితాలు ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. సరైన సమయంలో సరైన పద్ధతిలో చికిత్స అందించకుంటే రోగి ప్రాణానికే ప్రమాదమని ఇటీవల కేంద్రం హెచ్చరించింది.