కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మూడో దశ డౌన్ గడువు మే 17తో ముగియనుంది. గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మళ్లీ లాక్డౌన్ పొడిగింపుపై కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఐదోసారి. దేశంలో దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం అంశమే ప్రధానంగా చర్చ సాగనుంని తెలుస్తోంది.
కొవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం రెడ్ జోన్లుగా ఉన్న వాటిని ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్పుచెందేలా చూడటం, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడంపైనే దృష్టి సారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27వ తేదీన ప్రధాని మోడీ, సీఎంలతో చర్చ జరిగిన సమయంలో దేశంలో కరోనా కేసులు 28వేల వరకు ఉండగా ప్రస్తుతం అది 63 వేల వరకు చేరుకున్న విషయం తెలిసిందే. మార్చి 25వ తేదీన మొదటిసారిగా దేశవ్యాప్త లాక్డౌన్ను అమల్లోకి తెచ్చిన కేంద్రం మూడోసారి ఈ నెల 17వ తేదీ వరకు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇదేసమయంలో పలు సడలింలు కూడా ఇచ్చింది.