ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన, అవంతి శ్రీనివాస్, కన్నబాబు, జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అధికారులు ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను జగన్ కు తెలియజేశారు. సంఘటనా స్థలంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెప్పడంతో బాధితులను వారి ఇళ్లకు చేర్చాలని సీఎం ఆదేశించారు.
మంత్రులు, అధికారులు రాత్రికి ఆయా గ్రామాల్లోనే బస చేయాలని సీఎం సూచించారు. ఈరోజు ఉదయం మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్లు గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందజేశారు. మంత్రులు మొత్తం 8 కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు.