హమ్మయ్య.. ఎట్టకేలకు ఆయన ఒప్పుకున్నారు..! అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చాలా బెటరని ఆయన అన్నారు.. ఇంతకీ ఈ మాటలన్నది ఎవరని అనుకుంటున్నారా..? ఆయన మరెవరో కాదు.. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ రాధాకృష్ణ. అందరికీ ఆర్కే అని కూడా ఆయన పరిచయమే..! అయితే.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం.. వైఎస్సార్ పాలన అత్యంత దుర్మార్గంగా ఉందని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చాడని, ఆయన పాలనలో విచ్చలవిడిగా దోపిడీ జరిగిందంటూ పనిగట్టుకుని రాసిన రాధాకృష్ణ.. ఇప్పుడు వైఎస్సార్ పాలనే బెటరని ఒప్పుకోవడం ఏమిటని అనుకుంటున్నారా..? అవును.. మీ డౌటు కరెక్టేమరి! కానీ.. నిన్న రాసిన కొత్త పలుకు శీర్చికలో రాధాకృష్ణ స్వయంగా రాశారు..! అయితే.. ఎందుకురాశారు..? ఎందుకు రాయాల్సి వచ్చింది..? అని అనుకుంటున్నారా..? ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకో పత్రిక.. చాలా పత్రికలు పార్టీలకు అనుబంధంగానే ఉంటున్నాయి. ఇక ఉపాధి కోసం పనిచేస్తున్న పాత్రికేయులు ఆ పత్రిక పాలసీకి అనుగుణంగా పనిచేయాల్సిన పరిస్థితులు. ఇక రాధాకృష్ణ చంద్రబాబు మనిషికావడంతో ఆయన పత్రిక ఆంధ్రజ్యోతి కూడా బాబుగారిని కాపాడుకోవడమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇది బహిరంగ రహస్యమే. ఆనాడు చంద్రబాబు కోసం వైఎస్సార్పై విరుచుకుపడిన రాధాకృష్ణ.. ఇప్పుడు ఇదే చంద్రబాబు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిజంగానే ఆయన కొత్తపలుకులో సరికొత్త పలుకు అందుకున్నారు. అదేమిటంటే.. ఏపీ సీఎం జగన్ పాలనకంటే.. నాటి వైఎస్సారే బెటరని అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత తీవ్రమైన గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్న రాధాకృష్ణ.. జగన్ను ఎదుర్కొనేందుకు ఇలా సరికొత్త మార్గంలో వస్తున్నారన్నమాట. జగన్ పాలన బాగాలేదని చెప్పడానికి నాటి వైఎస్సార్ పాలనే బెటరని చెప్పారన్న మాట. ఎట్టకేలకు ఆయన సునిశిత పరిశీలనలో తేల్చింది ఇదన్నమాట!