ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా వైరస్కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ వైరస్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు పలువురు వైద్యనిపుణులు పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. తాజాగా.. భారతీయ ప్రాచీన వైద్యం ఆయుర్వేద చిట్కాలు కూడా కరోనాను దూరం చేస్తుందని చెబుతున్నారు. ఆయుర్వేద ధూపంతో కరోనా వైరస్కు దూరంగా ఉండవచ్చని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సులోచన అరిగె చెబుతున్నారు. భౌతికదూరం పాటించడంతోపాటు కొన్ని ఆయుర్వేద పద్ధతులు పాటిస్తే మహమ్మారిని తరిమికొట్టవచ్చునని అంటున్నారు.
కరోనాతోపాటు ఇతర వైరస్లు, రోగాల బారిన పడకుండా ఆయుర్వేదంలో అనేక ప్రక్రియలు ఉన్నాయని చెప్పారు. మన ఇల్లు, పరిసరాలు, ఆఫీసులు, దవాఖానలను శుభ్రపరిచేందుకు అక్కడుండే గా లిని స్వచ్ఛ పరచాలని సూచిస్తున్నారు. మహాసాక్షి, కర్పూరం, అవిసె గింజలు, నల్లనువ్వులు, గుగ్గులు, పసుపు కొమ్ములు వంటివాటితో మట్టిపాత్రలో ధూపంవేయాలని... ఆ పొగ ఇల్లంతా వ్యాపింపజేయాలని.. బాదాం, అక్రోట్, పూల్ మఖావ్, త్రిఫలాలు, గులాబీ రేకులతో కూడా ధూపం వేయొచ్చునని చెబుతున్నారు. ఇంట్లో ప్రతి గదిలోనూ మూతలేకుండా ఓ గిన్నెలో కర్పూరం ఉంచినా సరిపోతుందని.. రకరకాల రోగ కారక క్రిములు పోతాయని అంటున్నారు.