విశాఖ జిల్లా పాడేరు మన్యంలో అతి తక్కువ బరువుతో ఓ శిశువు జన్మించింది. పెదబయలు మండలం గలగండ పంచాయతీ గసాబు గ్రామానికి చెందిన ఉల్లి కృష్ణకుమారి ఆరు నెలల గర్భిణి. ఈ నెల 9న పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమె పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆమె కండిషన్ బాగా లేకపోవడంతో అబార్షన్ చేయాలని మొదట వైద్యులు భావించారు. అయితే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు స్కానింగ్లో తేలడంతో అదే రోజు అతికష్టం మీద ఆమెకు కాన్పు చేశారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పుట్టిన మగబిడ్డ బరువు కేవలం 480 గ్రాములే ఉండడం గమనార్హం. బేబీ కేర్ యూనిట్లో శిశువును ఉంచి సేవలందిస్తున్నట్టు డాక్టర్ పీ.ప్రవీణ్వర్మ చెప్పారు. తల్లీబిడ్డలను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ఇంత తక్కువ బరువుతో బిడ్డ పుట్టి, ఇప్పటి వరకూ జీవించి ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇదే ప్రథమమని చెప్పారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు.