తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా.. జగిత్యాల జిల్లాలో మరో కరోనా కేసు నమోదయ్యింది. వెల్గటూరు మండలం గుల్లకోట గ్రామానికి చెందిన 50 ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే అధికారులు ఆయనను హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి మరో ఐదుగురితో కలిసి ఈ నెల 10న ముంబై నుంచి వచ్చాడని డీఎంహెచ్వో శ్రీధర్ తెలిపారు. మొత్తం ఆరుగురికి కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 79మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఈ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,275కు చేరుకున్నది. ఇప్పటివరకు 30మంది మత్యువాత పడగా, 801 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 444 మంది ప్రస్తుతం గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే 50 మంది డిశ్చార్జి అవగా, వీరిలో హైదరాబాద్కు చెందిన 42 మంది, సూర్యాపేటకు చెందిన నలుగురు, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.