తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులను కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. మొత్తానికి ఎలాగోలా గట్టెక్కేశారు అనుకుంటోన్న టైంలో ఇప్పుడు తెలంగాణకు కరోనా విషయంలో మరో ప్రమాదం పొంచి ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు కాస్త తక్కువగానే ఉన్నాయి. అయితే సోమవారం ఒక్కసారిగా 75 కేసులు నమోదు కావడంతో మళ్లీ అందరూ ఉలిక్కి పడక తప్పలేదు.
ఇక ఇప్పుడు వలస కార్మికుల రూపంలో తెలంగాణలో కరోనా కేసులు ఒక్కసారిగా విజృంభించనున్నాయా ? అంటే అవుననే సందేహాలే వ్యక్త మవుతున్నాయి. వలస కార్మికుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వస్తోన్న వారి ద్వారా తెలంగాణ వాసులకు భారీగా కరోనా సోకుతోందన్న ఆందోళన ఇప్పుడు ఎక్కువుగా కనిపిస్తోంది. ముఖ్యంగా వైరస్ ఎక్కువుగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారితోనే ఈ ప్రమాదం ఎక్కువుగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎలెర్ట్ అయ్యింది.
వైరస్ తీవ్రత ఎక్కువుగా ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న వలస కార్మికులపై ఫోకస్ చేయడంతో పాటు వారికి రాష్ట్ర సరిహద్దుల్లోనే ఉష్ణోగ్రత చూసి క్వారంటైన్ స్టాంప్స్ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి వస్తున్నవారికి పరీక్షలు నిర్వహించగా కూలీలకు వైరస్ పాజటివ్ అని తేలింది. వీరిలో మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన 11 మంది ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో వలస కార్మికుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు వివరిస్తున్నారు.