కేంద్ర ప్రభుత్వం మంగళవారం నుంచి ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి 15 ప్రాంతాలకు ఈ రైళ్లను నడిపించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఢిల్లీ నుంచి దిబ్రుగఢ్, బెంగళూరు, బిలాస్పూర్కు ఒక్కోటి చొప్పున మూడు రైళ్లు, హౌరా, రాజేంద్రనగర్ (పాట్నా), బెంగళూరు, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి ఒక్కోటి చొప్పున ఐదు రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ రైళ్లలో మొదటి, రెండవ, మూడో తరగతి ఏసీ కోచ్లు మాత్రమే ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు, ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా రైల్వేశాఖ జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే.. ఈ మార్గదర్శకాలను పాటిస్తేనే రైలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది. అయితే.. తత్కాల్, ప్రీమియం తత్కాల్, కరెంట్ బుకింగ్, ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్, ఆన్బోర్డు బుకింగ్లు లేవు. ఆన్లైన్లో టికెట్లు బుకింగ్ చేసుకున్న వారికే ప్రయాణ అనుమతి ఉంటుంది. బుకింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 82వేల మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. 45,533 టికెట్లను అమ్మడం ద్వారా రూ.16కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు పేర్కొంది.