కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ వాతావరణానికి ఎంతో మేలు చేస్తోంది. జనం ఇళ్లకు పరిమితమైపోవడం.. వాహనాలు రోడ్లపైకి రాకపోవడంతో గాలి కాలుష్యం దాదాపుగా తగ్గిపోతోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా హిమాలయపర్వతాలు కనిపిస్తున్న అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇన్నాళ్లూ మురికికూపంగా మారిన అనేక నదులు శుభ్రం అవుతున్నాయి. నదీజలాలు శుద్ధ జలాలుగా మారుతున్నాయి. తాజాగా.. గంగానదికి సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి బయటకు వచ్చింది. ఐఐటీ విభాగం ఆధ్వర్యంలో గంగానదిపై చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దేవప్రయాగ నుంచి హరిద్వార్ వరకు గంగానది నీరు తాగేందుకు వీలుగా అత్యంత పరిశుభ్రంగా మారిందని ఆ అధ్యయనంలో వెల్లడైంది.
నిజానికి.. గంగానదిని క్లీన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యక్రమం కూడా చేపట్టిన విషయం తెలిసిందే. కానీ.. ఈ కార్యక్రమంతో కూడా కానిపని.. ఒక్కలాక్డౌన్తో అయిందని ఈ సందర్భంగా పలువురు విశ్లేషకులు అంటున్నారు. నిజానికి.. అనేక శతాబ్దాల తర్వాత గంగానది జలాలు ఇంత శుభ్రంగా మారాయని చెబుతున్నారు. నిజానికి.. గంగానది అంటే.. ఎంతో మురికికూపంగా.. శవాలను కూడా అందులోనే వేసేపరిస్థితులే గుర్తుకువస్తాయి. కానీ.. లాక్డౌన్ కారణంగా నది ఒడ్డున అనేక కార్యకలాపాలు నిలిచిపోవడంతో నదీజలం శుద్ధ జలంగా మారినట్లు ఐఐటీ విభాగం చేపట్టిన అధ్యయనంలో తేలడం మంచి పరిణామం అని విశ్లేషకులు అంటున్నారు.