కరోనా కష్ట కాలంలో అన్నివర్గాల ప్రజలను ఆదుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులోనూ రైతులకు అండగా ఉండేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. తాజాగా.. ఆక్వా రైతులకు కూడా శుభవార్త చెప్పేందుకు సీఎం జగన్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు నిర్ణయిస్తున్న విధంగానే రొయ్యలు, చేపలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించనుందని, సీఎం వైఎస్ జగన్ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారని చెప్పారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా రైతులు సాగు ప్రారంభించిన సమయంలోనే వ్యవసాయ పంటలకు ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిందన్నారు.
ఇదే తరహాలో రొయ్యలు, చేపలకు మద్దతు ధరను ప్రకటించనుందని ఆయన చెప్పారు. రొయ్యలు, చేపల ధరలు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఏ సమయాల్లో ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ–మార్కెటింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. ఆక్వా ఉత్పత్తులను మంచి ధరలకు అమ్ముకునే సౌలభ్యాన్ని కల్పిస్తామన్నారు. చేపలు, రొయ్యల పెంపకాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామని.. ఆక్వా అథారిటీ ఏర్పాటు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటన కోసం ఆక్వా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.