లాక్డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలు కూడా భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా గత 50 రోజులుగా ఆలయాల్లోకి భక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,260 ఆలయాలు ఉన్నాయి. ఇందులో సగం వరకు ఏడాదికి రూ. లక్షలోపు ఆదాయం వచ్చేవే. దీంతో రాష్ట్రంలోని ఆలయాలకు రూ. 100కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని దేవాదాయశాఖ అధికారులు అంచనా వేస్తోంది. గత ఏడాది మార్చి 20 నుంచి ఏప్రిల్ 31 వరకు వచ్చిన ఆదాయం ఆధారంగా ఈసారి నష్టపోయిన మొత్తాన్ని లెక్కగడుతున్నారు.
ఆ ప్రకారం చూస్తే.. మొత్తం రూ. 100 కోట్లకుపైగా నష్టం వాటిల్లగా.. అందులో యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, కొమురవెల్లి, బాసర, భద్రకాళి వంటి ప్రముఖ ఆలయాలకే సుమారు రూ.50కోట్ల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అలాగే.. శ్రీరామనవమి ఉత్సవాల రద్దుతో భద్రాద్రి ఆలయ ఆదాయం భారీగా తగ్గింది. వేములవాడ రాజన్న ఆలయంలోనూ రూ. 8 కోట్లకుపైగా నష్టం ఏర్పడిందట. యాదాద్రిలోనూ సుమారు రూ. 10 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. భక్తులు రాక నిలిచిపోవడంతో ఆర్జిత సేవలు, హుండీ ఆదాయంతోపాటు ప్రసాద విక్రయాల వల్ల వచ్చే ఆదాయం కూడా నిలిచిపోయింది.