కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పట్లో షూటింగ్స్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇక థియేటర్లు తెరిచే పరిస్థితులు దగ్గరగా కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం వైపు నిర్మాతలు కదులుతున్నారు. తమ చిత్రాలని డిజిటల్ ప్లాట్ఫాంలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలుగులో ఇప్పటికే ‘అమృతరామమ్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కాగా, తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా, హిందీ చిత్రం లక్ష్మీ బాంబ్ కూడా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా.. అనుష్క నటించిన నిశ్శబ్దం కూడా ఓటీటీలో విడుదల అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘పెంగ్విన్’చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తమిళం, తెలుగు వర్షన్లను ఒకేసారి విడుదల చేయడానికి అమెజాన్ ప్రైమ్ తో నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది. జూన్లో ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ఫాంలోకి వస్తుందని అంటున్నారు. ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. ‘పెంగ్విన్’లో కీర్తి సురేశ్ గర్భవతిగా కనిపించనున్న విషయం తెలిసిందే.