కరోనా మహమ్మారిపై పోరుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ.3,100 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ రూ.3,100 కోట్లలో వైద్య పరికరాల కొనుగోలుకు కేంద్రం పెద్దపీట వేసింది. అలాగే.. వెంటిలేటర్ల కొనుగోలుకు రూ.2000 కోట్లను కేటాయించినట్లు కేంద్రం పేర్కొంది. రూ.100 కోట్లను వ్యాక్సిన్ అభివృద్ధికి కేటాయించింది. వలస కార్మికులకు కూడా అండగా నిలవాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా.. రూ.1000 కోట్లను వలస కార్మికుల కోసం కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ కింద కూడా కేంద్రం రూ.20లక్షల కోట్లతో భారీ ప్యాకేజీని కేటాయించిన విషయం తెలసిందే. ఈ ప్యాకేజీ వివరాలను నిన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామాన్ వెల్లడించారు. దాదాపుగా అన్నిరంగాలకు నిధులు కేటాయించారు. మరోవైపు.. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. రాష్ట్రాలను ఏమాత్రమూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.