కరోనా వైరస్పై ఐరోపా దేశం స్లోవేనియా సంచలన ప్రకటన చేసింది. తమ దేశంలో మహమ్మారి కథ ముగిసిందని ప్రకటించింది. కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ శుక్రవారం దేశ సరిహద్దులను తెరిచింది. కరోనాకు సంబంధించి యావత్ యూరోప్లో తమదేశంలోనే పరిస్థితి మెరుగ్గా ఉన్నదని, దీని వల్లే ఈ ప్రకటన చేసినట్లు స్లొవేనియా ప్రధానమంత్రి జానెజ్ జాన్సా తెలిపారు. ఇటలీ సరిహద్దున ఉన్న స్లొవేనియాలో ఇప్పటివరకు కేవలం 1500 కేసులు నమోదు కాగా, 103 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొత్త కేసులు నమోదు తగ్గిన నేపథ్యంలో మిగతా యురోపియన్ యూనియన్ పౌరులకు సరిహద్దులను తెరిచింది. ఐరోపాయేతర పౌరులు మాత్రం 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని పేర్కొంది. అయితే.. కరోనా ముప్పు ఇంకా పొంచి ఉన్నందున పలు ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొనడం. అలాగే.. ప్రజలు గుమిగూడడంపై నిషేధం కొనసాగనుంది. నిర్ణీత దూరం, మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. వచ్చే వారం నుంచి షాపింగ్ మాళ్లు, హోటళ్లు ప్రారంభం అవుతాయని, 23 నుంచి ఫుట్బాల్, ఇతర క్రీడాపోటీలు ప్రారంభించనున్నట్లు తెలిపింది.