పారిశ్రామిక దిగ్గజం, దేశీ కుబేరుడు ముకేశ్ అంబానీ మరో రికార్డుకు దగ్గరలోనే ఉన్నారు. దశాబ్ద కాలంలో ట్రిలియనీరుగా ఎదగనున్నారు. 2033 నాటికి 75 ఏళ్ల వయసులో.. ఏకంగా 1 లక్ష కోట్ల (ట్రిలియన్) డాలర్ల సంపదతో ట్రిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ గణాంకాల ప్రకారం ఇప్పటికే ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేశ్ సంపద ప్రస్తుతం సుమారు 53.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వివిధ వ్యాపారాలపై అధ్యయనం చేసే కంపేరిజన్ సంస్థ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు, సంపన్న కంపెనీల చారిత్రక వేల్యుయేషన్లను అధ్యయనం చేయడం ద్వారా ఎవరు, ఎప్పుడు ట్రిలియన్ డాలర్ల క్లబ్లో చేరతారనేది కంపేరిజన్ అంచనా వేసింది. ఇక్కడే మరొక విషయం కూడా ఉంది.. 2026 నాటికి అమెరికన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తొలి ట్రిలియనీర్ హోదా అందుకోనున్నారు. 145 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. గడిచిన అయిదేళ్లలో ఆయన సంపద సగటున 34 శాతం మేర పెరిగింది.