తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్-2020 దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి వివరాలను వెల్లడించారు. కొవిడ్-19 దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు గడువును పొడిగించామని ఆయన తెలిపారు.
అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.450, ఇతరులు రూ.650 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని, అభ్యర్థులు తమకు ఇష్టం వచ్చిన కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పరీక్ష తేదీని త్వరలో తెలియజేస్తామని ఆయన చెప్పారు.