బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని వివిధ పట్టణాలకు తరలివెళ్లిన వలస కార్మికులపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ సడలింపులతో కొందరు శ్రామిక్ రైళ్లు, ఇతర వాహనాల్లో సొంతూళ్లకు వెళ్తుండగా.. మరికొందరు కాలినడక వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. చాలా మంది గుంపులుగా గుంపులుగా ట్రక్కుల్లో వెళ్తుండటం వలన వీరిలో చాలా మంది కరోనా పాజిటివ్కు గురవుతున్నారు. సొంత రాష్ట్రాలకు చేరుకోగానే అక్కడి ప్రభుత్వాలు వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపిన తర్వాతనే వారివారి ఇండ్లకు పంపిస్తున్నాయి.
ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 10,385 మంది వలస కార్మికులు ఇప్పుడు బిహార్లో ఉన్నారు. వీరికి ప్రభుత్వం వివిధ దవాఖానల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 560 మందికి పాజిటివ్గా తేలింది. వీరి నుంచి మరింత మందికి సోకకుండా ఉండేందుకు వీరిని ప్రభుత్వ క్వారంటైన్కు తరలించారు. 560 మందిలో 172 మంది ఢిల్లీకి చెందినవారు, 123 మంది మహారాష్ట్ర, 26 మంది పశ్చిమ బెంగాల్ వాసులని బీహార్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నివేదిక వెల్లడించింది. మరో 2,746 శాంపిల్స్ కు సంబంధించిన ఫలితాలు అందాల్సి ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు.