దేశంలో పరిశుభ్ర నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. వ్యర్ధాల నిర్వహణలో నగరాలు కనబర్చిన పనితీరును ప్రామాణికంగా తీసుకొని ఫైవ్స్టార్, త్రీస్టార్, వన్స్టార్ అని మూడు విభాగాలుగా విభజించింది. రాజ్కోట్, ఇండోర్, నవీ ముంబై ఫైవ్స్టార్ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. మొత్తం 141 నగరాలకు ఈ రేటింగ్స్ను కేంద్రమంత్రి హర్దీప్సింగ్పూరి ప్రకటించారు. కేంద్రప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం శుభ్రతపై ప్రజల్లో ఎంతో అవగాహన కల్పించిందని, ఆ అవగాహన ప్రస్తుతం కరోనాపై పోరుకు ఉపయోగపడుతున్నదని మంత్రి తెలిపారు.
ఫైవ్స్టార్ రేటింగ్ను అందుకున్న నగరాల్లో రాజ్కోట్, ఇండోర్, నవీ ముంబై, అంబికాపూర్ (ఛత్తీస్గఢ్), మైసూరు (కర్ణాటక), సూరత్ (గుజరాత్), త్రీ స్టార్ రేటింగ్ పొందినవి నగరాల్లో ఢిల్లీ, కర్నాల్ (హర్యానా), తిరుపతి, విజయవాడ (ఏపీ), చండీగఢ్, బిలాయ్నగర్ (ఛత్తీస్గఢ్), అహ్మదాబాద్ (గుజరాత్), భోపాల్ (మధ్యప్రదేశ్), జంషెడ్పూర్ (జార్ఖండ్) మొదలైనవి ఉన్నాయి. సింగిల్ స్టార్గా నిలిచినవి 70 పట్టణాల్లో ఢిల్లీ కంటోన్మెంట్, రోహతక్ (హర్యానా), గ్వాలియర్, మహేశ్వర్, ఖాంద్వా, బద్నవార్, హతూద్ (మధ్యప్రదేశ్), వడోదరా, భావ్నగర్ (గుజరాత్) తదితర నగరాలు ఉన్నాయి.