కృష్ణా నదీ జలాల వినియోగంలో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు కలిపి 920.405 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ 647.559 టీఎంసీలు వినియోగించుకుంటే.. తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకుంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వాటా వినియోగం పూర్తి కాగా.. తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీల మిగులు ఉంది. ఉమ్మడి ప్రాజెక్ట్లు, మధ్యతరహా ప్రాజెక్ట్లలో కనీస నీటి మట్టానికి ఎగువన 60.333 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది.
రాష్ట్ర విభజన తర్వాత గత ఆరేళ్లుగా కృష్ణా నదీ జలాల వినియోగం లెక్కలను కృష్ణా బోర్డు పక్కాగా తేల్చుతోంది. అంతకుముందు అంటే.. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వినియోగం లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉండేది కాదు. కాగా, నీటి సంవత్సరం జూన్ 1న ప్రారంభమై.. మే 31న ముగుస్తుంది. ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి భారీగా 1,782 టీఎంసీల ప్రవాహం వచ్చింది.