కరోనా సృష్టిస్తున్న కల్లోలం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆరు కోట్ల మంది ప్రజలు కటిక పేదరికంలోకి కూరుకపోయే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ హెచ్చరించారు. కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడంతో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయని తెలిపారు. పేదరిక నిర్మూలనలో సాధించిన ప్రగతి అంతా కరోనా కారణంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు.. కరోనాతో పోరాటం చేస్తున్న వర్థమాన దేశాలకు సమయానికి ప్రపంచ బ్యాంకు సాయం అందుతోందని తెలిపారు. 100 దేశాలకు 15 నెలల్లో 160 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందిచాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా అనేక దేశాలు ఇప్పటికే ఆర్థిక సాయం పొందాయని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి.