ఉన్నత చదువు కోసం ఫ్రాన్స్ దేశానికి వెళ్లిన తెలుగు యువకుడు అనారోగ్యంతో అక్కడే మృతి చెందాడు. అయితే, కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో యువకుడి మృతదేహాన్ని స్వదేశం తెచ్చుకోవాలన్న ఆయన కుటుంబసభ్యుల చివరి కోరిక తీరే అవకాశం కనిపించడం లేదు. కృష్ణాజిల్లా రేమల్లె ప్రాంతానికి చెందిన అవిర్నేని రంగారావు కుమారుడు, టీడీపీ నేత కలపాల సూర్యనారాయణ మేనల్లుడు ప్రవీణ్కుమార్(28) ఎంఎస్ చదివేందుకు రెండేళ్ల క్రితం ఫ్రాన్స్కు వెళ్లాడు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఆయన బాధపడుతున్నాడు.
ఈక్రమంలో అక్కడే దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన ప్రవీణ్ తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కడసారి తమ బిడ్డను చూసుకోవాలని, అయిన వారి మధ్య అంత్యక్రియలు నిర్వహించుకోవాలని తపిస్తున్నారు. అయితే, మృతదేహాన్ని తెచ్చుకునేందుకు అనుమతులు లభించనట్లు తెలుస్తోంది.