లాక్డౌన్ సడలింపులతో ఈ నెల 25వ తేదీ నుంచి పునరుద్ధరించనున్న దేశీయ విమాన సర్వీసుల చార్జీలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. కనిష్ఠ చార్జీ రూ.2వేలు మొదలు గరిష్ఠ చార్జీ రూ.18,600గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) పేర్కొంది. ప్రయాణ సమయం ఆధారంగా విమాన సర్వీసులను ఏడు క్యాటగిరీలుగా విభజించి ఆ మేరకు చార్జీలపై పరిమితి విధించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. సగటు ధరకు 40 శాతం టికెట్లు విక్రయించనున్నట్లు చెప్పారు.
అన్ని విమానయాన సంస్థలు దీన్ని పాటించాలని ఆయన సూచించారు. ఆగస్టు 24 వరకు ఇది అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. మెట్రో నగరాలతోపాటు వారంలో వందకుపైగా సర్వీసులు నడిచే నగరాల్లో సోమవారం నుంచి మూడొంతుల విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. విమానాల్లోని మధ్య సీట్లను ఖాళీగా ఉంచట్లేదన్నారు.