ఆంపన్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్, ఒడిశాలో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ముందుగా పశ్చిమబెంగాల్లో ఆయన పర్యటించారు. ఈ క్రమంలో శుక్రవారం ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ. వెయ్యి కోట్ల తక్షణ ఆర్ధిక సాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. తుఫాను బీభత్స దృశ్యాలు ప్రత్యక్షంగా చూశానని, ఈ కష్ట సమయంలో బెంగాల్ను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు మోదీ తెలిపారు. తుపాను ధాటికి బెంగాల్లో ఇప్పటివరకు 80 మందికిపై మృత్యువాత పడగా, వేల ఎకరాల్లో పంట నష్టం, వంతెనలు కూలిపోయాయి. అనంతరం ఆయన ఒడిశాకు చేరుకున్నారు. ఈ రాష్ట్రంలోనూ ఆయన ఏరియల్ వ్యూ ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఇక్కడి ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు.