లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకార్మికులు, కూలీలు, తదితరులను స్వస్థలాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ నుంచి ఒడిశాలోని బలంగిర్కు వెళ్తున్న ఓ గర్భిణి శ్రామిక్ రైలులోనే ప్రసవించింది. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు బలంగిర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. కాగా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకురానున్న 10 రోజుల్లో 2,600 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
ఈ రైళ్లలో 36 లక్షల మంది వలస కార్మికులను తరలించనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి బయలుదేరే శ్రామిక్ రైళ్లలో ప్రయాణించే వారి కోసం ఇప్పటికే ఉన్న వెయ్యి టికెట్ కౌంటర్లకు అదనంగా మరికొన్నిటిని ఏర్పాటు చేస్తామని అని అన్నారు.