గోల్ మెషీన్ పేరుతో ఖ్యాతినందుకున్న ప్రముఖ హాకీ క్రీడాకారుడు, పద్మశ్రీ బల్బీర్ సింగ్ (95) ఈరోజు ఉదయం చండీగఢ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో ఆయన కొన్ని నెలల నుంచి బాధ పడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. బల్బీర్ సింగ్ మూడుసార్లు భారత్కు ఒలింపిక్ బంగారు పతకాలు అందించిన ఘనత దక్కించుకున్నారు.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించిన 16 మంది దిగ్గజాలలో బల్బీర్ సింగ్ ఒకరు. హాకీ ఒలింపిక్స్ లండన్ (1948), హెల్సింకి (1952), మెల్బోర్న్ (1956) లలో భారత్ బంగారు పతకాలను సాధించగా ఈ మూడు జట్లలో బల్బీర్ సింగ్ సీనియర్ సభ్యునిగా ఉన్నారు. 1957లో భారత ప్రభుత్వం బల్బీర్ సింగ్ ను పద్మశ్రీతో సత్కరించింది.