దేశంలో కరోనా వైరస్ పెరుగుదల రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఫిబ్రవరిలో మెల్లి మెల్లిగా మొదలైన ఈ కరోనా వైరస్ నేటికి దాని విసృతి పెంచుకుంటూ పోతుంది. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. నాలుగు రోజులుగా 6,000పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 77,103 యాక్టివ్గా ఉండగా, 57,720 మంది బాధితులు కోలుకున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడిన 4021 మంది మృతిచెందారు. ఒకే రోజు సుమారు ఏడు వేల పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ పదో స్థానానికి చేరింది. ఇప్పటివరకు ఇరాన్ ఆ స్థానంలో ఉన్నది.
ఇదిలా ఉంటే.. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో కొనసాగుతున్నది. ఇక్కడ ఇప్పటి వరకు 50231 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్తో 1635 మంది మరణించారు. 16,277 పాజిటివ్ కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 111 మంది మరణించారు. ప్రధాని సొంతరాష్ట్రమైన గుజరాత్లో ఇప్పటివరకు 14,056 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ 13,418 కేసులు, రాజస్థాన్ 7,028 పాజిటివ్ కేసులు, మధ్యప్రదేశ్ 6,665, ఉత్తరప్రదేశ్ 6268 పాజిటివ్ కేసులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.