కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ 4.0 కొనసాగుతోంది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వందేభారత్ మిషన్ పేరుతో ప్రత్యేక విమాన సర్వీసులు నడిపిస్తోంది. మరోవైపు ఈరోజు నుంచి దేశీయంగా విమానసర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విమానయాన సంస్థలు తమ సిబ్బంది నియమాలను పాటిస్తూ..పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాయి.
ఢిల్లీ-భువనేశ్వర్ విమానం(విస్తారా ఎయిర్లైన్స్) లో పనిచేస్తున్న ఎయిర్హోస్టెస్ ఒకరు మాట్లాడుతూ..కోవిడ్-19 నుంచి రక్షించేందుకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను ఫాలో అవుతున్నామని పేర్కొన్నారు. *గతంలో ఎప్పుడు మా యూనిఫాంపై ఎలాంటి రక్షణ కవచాలను ధరించలేదు. కానీ మాకు ఇపుడు ఓ కొత్త అనుభవం లాంటిది. ప్రయాణికులంతా నిబంధనలు పాటిస్తున్నారు* అని తెలిపారు.