ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్నవారికి ఐదు రోజుల్లో పింఛన్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొత్త విధానం అమలులోకి రానుంది. ఇకపై పింఛన్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. నూతన దరఖాస్తులను పరిశీలించి వారు అర్హులని తేలితే ఐదు రోజుల్లోనే పింఛన్ ను మంజూరు చేయనున్నారు.
గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని సచివాలయాల ద్వారానే మంజూరు పత్రాలను పొందవచ్చు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి స్వయంగా లేదా వాలంటీర్ ద్వారా అర్హతకు సంబంధించిన ధ్రువపత్రాలన్నీ సమర్పించాలి. డిజిటల్ అసిస్టెంట్ ఆ దరఖాస్తును స్వీకరించి, వివరాలన్నీ అన్లైన్లో నమోదు చేసి రశీదుని అందిస్తుంది. దరఖాస్తు పరిశీలన అనంతరం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సమగ్ర నివేదిక తయారు చేసి ఎంపీడీవో/ మున్సిపల్ కమిషనర్ కు అందజేస్తారు. వారు వాలంటీర్ ద్వారా లబ్ధిదారుని మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు.