దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ముఖ్యమంత్రుల పనితీరుపై సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆరేళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాలతో ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రజలు ఏకంగా 65 శాతం జై కొట్టారు. ఇక ముఖ్యమంత్రులపై ‘సీ ఓటర్’ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి టాప్ - 5 సీఎంల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
జగన్కు 78.1శాతం మంది ప్రజల మద్దతు లభించింది. నాలుగో స్థానంలో సీఎం జగన్ చోటు దక్కించుకున్నారని సీ ఓటర్ సర్వే నివేదికలో తెలిపింది. ముఖ్యమంత్రిగా పాలనాబాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాది కాలంలోనే అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. ఇక అత్యధిక ప్రజాదారణ లభించిన ముఖ్యమంత్రి జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తొలి స్థానంలో ఉండగా, తరువాత స్థానాల్లో ఛత్తీస్గఢ్, కేరళ ముఖ్యమంత్రులు భూపేశ్ వాఘేలా, పినరయి విజయన్ ఉన్నారు. ఐదో స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిలిచారు. ఇక ఈ జాబితాలో కేసీఆర్ 54.22 శాతం మద్దతుతో జగన్ కంటే చాలా వెనక పడ్డారు.