కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కొనసాగుతున్ఉన లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం కింద ఆర్థిక సాయం అందించనుంది. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రూ.262.495 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేల చొప్పున ఆన్లైన్ చెల్లింపులు జరగనున్నాయి. గత ఏడాది కంటే ఈ సారి అదనంగా 37,756 మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసింది.
నిజానికి.. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు అక్టోబర్లో రూ.పది వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే కరోనా కష్టాల నేపథ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం అందజేస్తోంది ప్రభుత్వం. ఈ పథకానికి ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబరు 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.