చైనా దేశంలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 65 లక్షల మందికి సోకింది. దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు ఈ ఏడాది జనవరి 30న కేరళలో నమోదైంది. అయితే హైదరాబాద్లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు జనవరి 30కు ముందే భారత్ లోకి కరోనా వైరస్ ప్రవేశించిందని చెబుతున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కనిపిస్తున్న వైరస్ స్ట్రెయిన్ మూలాలు 2019 వంబర్ 26 నుంచి డిసెంబర్ 25 మధ్యలోనివని చెబుతున్నారు.
కేరళలో గుర్తించిన కరోనా వైరస్కు వుహాన్ మూలాలు ఉన్నాయని... హైదరాబాద్ లో గుర్తించిన కరోనా వైరస్ మాత్రం భిన్నంగా ఉందని వారు చెబుతున్నారు. హైదరాబాద్ లో గుర్తించిన వైరస్కు ఆగ్నేయాసియా మూలాలు ఉన్నాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కే మిశ్రా మీడియాకు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో దేశంలో కరోనా పరీక్షలు నిర్వహించకపోవడంతో ఆ సమయంలోనే వైరస్ దేశంలోని ప్రవేశించిందా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.