గతంలో కృష్ణ నది జలాల పై తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు పోటీపడిన వివాదం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా కృష్ణ నది జలాల విషయమై ఇరు రాష్ట్రాలు మళ్లీ వివాదం చోటుచేసుకున్న దృష్ట్యా కృష్ణ నది యాజమాన్య బోర్డు తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలతో చర్చలు జరిపి తుది నిర్ణయాన్ని వెలువరించింది. భేటీ అనంతరం బోర్డు చైర్మన్ పరమేశం మీడియా సమావేశం నిర్వహించారు. కృష్ణ నది జలాలను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు 66:34 నిష్పత్తి లో వాడుకోవాలని సూచించింది.
హైదరాబాదులోని జలసౌధలో ఇరు రాష్ట్రాలతో సుదీర్ఘ సమావేశం జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం నుండి జల విద్యుచ్ఛక్తి 50:50 కి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. అదేవిధంగా తాగునీటి కోసం 20 శాతాన్ని ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. కృష్ణా బోర్డును ఏపీ రాజధానికి తరలించే అంశంలో కేంద్ర జలశక్తి శాఖదే తుది నిర్ణయం అని అన్నారు. అయితే కొత్త ప్రోజెక్టుల విషయమై ఇరు రాష్ట్రాలు డిపిఆర్ ని ప్రవేశపెట్టడానికి అనుమతినిచ్చాయి. అదేవిధంగా రెండో దశ టెలిమెట్రీని ప్రాధాన్యతాంశంగా పరిగణించి అమలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయని వివరించారు.