ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉనికిపాట్లు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి వరుసదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గుజరాత్లో అంతో ఇంతో బలంగానే కాంగ్రెస్కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరుస షాక్లు ఇస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్కు ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గుజరాత్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆక్షయ్ పటేల్, జితు చౌధరి తనకు రాజీనామా పత్రాలు ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదీ వెల్లడించారు. వీరిద్దరితో పాటు మార్చి నుంచి గుజరాత్లో మొత్తం ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం గమనార్హం.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించగానే.. మార్చిలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 182 కాగా, అధికార బీజేపీకి 103 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్కు ప్రస్తుతం 66 మంది సభ్యులున్నారు. జూన్ 19న ఎన్నికలు జరగనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు బీజేపీ సిటింగ్ స్థానాలే. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలిపింది. ఈ నేపథ్యంలో గుజరాత్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.