ఏపీ సీఎం వైయస్ జగన్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పటిష్టమైన ప్రణాళికలను రచిస్తున్నారు. రాష్ట్రంలో వైయస్సార్ హయాంలో నిర్మించిన శ్రీసిటీ తరహాలో ఐదు పారిశ్రామిక పార్కులను నిర్మించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. నిన్న పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కమిటీ తొలిసారి భేటీ అయింది.
రక్షణ–ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా–హెల్త్కేర్, టెక్స్టైల్ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే విధంగా డిజిగ్నేటెడ్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్లగ్అండ్ప్లే విధానంలో విదేశీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించుకునే విధంగా ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. పరిశ్రమల నుంచి ప్రతిపాదన వచ్చిన 30 రోజుల్లో పరిశ్రమకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్, మానవ వనరులను అందించేలా ప్రభుత్వం పారిశ్రామిక విధానాలను రూపొందిస్తోంది. పెట్టుబడి ప్రతిపాదనలు వేగంగా వాస్తవరూపం దాల్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తోంది.